మంచిర్యాల : పురిటి నొప్పులతో భాద పడుతున్న గర్భిణి ఇంటికి వెళ్లి 108 సిబ్బంది పురుడు పోశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన ఆకుదారి రాజేశ్వరికి పురిటి నొప్పులు ప్రారంభం కాగా 108కి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ ప్రవీణ్, పైలెట్ ఇమామ్ షరీఫ్ 108 వాహనం తీసుకొని కొల్లూరు బయలుదేరారు.
రాజేశ్వరికి పురిటి నొప్పులు తీవ్రం అయ్యాయి. వెంటనే ఈ విషయాన్ని 108 ఉన్నత అధికారులకు 108 సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం అందించారు. గర్భిణిని దవాఖానకు తీసుకువెళ్లేందుకు సమయం లేకపోవడంతో 108 ఉన్నత అధికారుల సూచనలు మేరకు ఇంట్లోనే ప్రసవం జరిపించగా కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండగా వారిని వైద్య పరీక్షల కోసం కోటపల్లి హాస్పిటల్ కు తరలించారు.