ముంబై: ఫేస్బుక్లో పరిచయమైన మహిళ ఒక వ్యక్తితో వీడియో చాట్ చేసింది. అతడి బట్టలు తీయించి వీడియో రికార్డ్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది. మరో ఇద్దరి వ్యక్తులతో కలిసి అతడ్ని బెదిరించి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేయించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 54 ఏళ్ల వ్యక్తి భార్య 2019లో మరణించింది. దీంతో మనస్తాపంతో అతడు ఉద్యోగం మానేశాడు. అయితే పిల్లలు ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు.
ఈ నెల 2న ఫేస్బుక్లో ప్రియాంజా జైన్ అనే మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. దానిని ఆమోదించడంతో మొబైల్ నంబర్ తీసుకున్న ఆమె అతడితో చాట్ చేసింది. అనంతరం ఆ మహిళ వీడియో కాల్ చేసింది. మాటల్లో కవ్వించి అతడిని బాత్ రూమ్కు వెళ్లమని చెప్పింది. ఆపై తియ్యని మాటాలతో ఆ వ్యక్తి బట్టలు విప్పించింది. నగ్నంగా మారిన అతడి వీడియోను రికార్డు చేసింది.
కాగా, అదే రాత్రి పది గంటలకు ఆ మహిళ అతడికి ఫోన్ చేసింది. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది. లేనిపక్షంలో అతడి నగ్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించింది. ఆ తర్వాత రోజు కూడా ఆ వ్యక్తికి ఆమె ఫోన్ చేసింది. దీంతో భయపడిన అతడు తొలుత రూ.30,000 ఆమెకు పంపాడు.
మరోవైపు సెప్టెంబర్ 5న సీబీఐ అధికారి పేరుతో ఒక వ్యక్తి అతడికి ఫోన్ చేశాడు. నగ్న వీడియో వైరల్ అయ్యిందని, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని భయపెట్టాడు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే దానిని తొలగించాలని సూచించాడు. అలాగే యూట్యూబ్ అధికారిగా పేర్కొంటూ మరో మోసగాడి మొబైల్ నంబర్ ఇచ్చాడు. అయితే ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించేందుకు ఆ రెండో వ్యక్తి రూ.5.28 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.