వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తండాలలో గిరిజనుల ఆర్థిక శక్తి పెరిగింది. రైతుబంధు, రైతు బీమా, సాగునీళ్లు, ఉచిత కరంటు పథకాలతో వ్యవసాయం బలపడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని థానే కేపీఆర్ డిగ్రీ కళాశాల, బోరేవళి నలంద అకాడమీలో నిర్వహించిన వనపర్తి నియోజకవర్గ గిరిజన సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణలో కేసీఆర్ చేసిన పనులు వంద ఉన్నాయి . ప్రధాని మోదీ చేసిన పని ఒక్కటి అయినా చూపించగలరా ? అని మంత్రి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ముంబైలో ఉంటున్న మీకు మీ పక్కింట్లో తెలంగాణ మాదిరిగా ఎవరికన్నా కల్యాణలక్ష్మి, వృద్ధ్యాప్య ఫించన్లు వస్తున్నాయా ? కేసీఅర్ కిట్ అమ్మవడి పథకాలు అందుతున్నాయా ? రైతుబంధు,రైతుబీమా పథకాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
ఇలాంటివి ఏవి ఇవ్వనోళ్లు ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో వలసొచ్చిన మీరు వెనక్కు వస్తారని హామీ ఇచ్చాను. సాగునీళ్లు వస్తాయి. సంక్షేమ పథకాలు అందుతాయి అని చెప్పాను. పొట్ట చేత పట్టుకుని మీరు వలస వెళ్లవద్దే పరిస్థితి ఉండొద్దని అన్నాను. నాడు నేను చెప్పిన ప్రకారం 70 శాతం హామీ నెరవేరిందన్నారు.
నేడు మిమ్మల్ని కలుసుకోవడం కడుపు నిండినట్లుందని మంత్రి తెలిపారు.తండాలలో అన్ని వసతులు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రి వెంట ఎంపీపీ కృష్ణ నాయక్, జడ్పీటీసీ సామ్యానాయక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జాతృనాయక్, శేఖర్ నాయక్ తదితరులు ఉన్నారు