Eknath Shinde | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తీరుపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ధ్వజమెత్తింది. పార్టీపై వారసత్వ హక్కుల కోసం ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్తో కలిసి సీఎం ఏక్నాథ్ షిండే వేదిక పంచుకోవడాన్ని ఉద్ధవ్ వర్గం తప్పుబట్టింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఇలాంటి ఘటనలే కారణం అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అధికార ప్రతినిధి అరవింద్ సావంత్ అన్నారు. ప్రస్తుతం నియమ నిబంధనల ప్రకారం, చట్టాల ప్రకారం ఏమీ జరుగడం లేదన్నారు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలతో కలిసి సీఎం ఏక్నాథ్ షిండే సన్మానించారు. దీన్ని విపక్ష మహా వికాస్ అఘాదీ కూటమి తప్పు పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధతతను సవాల్ చేస్తున్న కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం వేదిక పంచుకోవడం సరి కాదని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సన్మాన కార్యక్రమంలో సీఎం షిండే పాల్గొనడం అసంబద్ధం అని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ వ్యాఖ్యానించారు.