న్యూఢిల్లీ, ఆగస్టు 3: కొద్ది వారాల క్రితం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్పులు చేసింది. డీజిల్ ఎగుమతులపై అమల్లో ఉన్న పన్నును తగ్గించగా, ఏటీఎఫ్ ఎగుమతులపై రద్దు చేసింది. బుధవారం విడుదలైన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ లీటర్పై విండ్ఫాల్ ట్యాక్స్ను రూ.11 నుంచి రూ.6కు తగ్గించింది. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై లీటరుకు రూ.4 పన్నును తొలగించింది.
పెట్రోల్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ జీరోగా కొనసాగుతుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్నును టన్నుకు రూ. 17,000 నుంచి రూ. 17,750కు పెంచింది. క్రూడాయిల్పై పన్ను పెంచడం ఓఎన్జీసీ, వేదాంతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుండగా, డీజిల్, ఏటీఎఫ్లపై పన్నులు కోత విధించడం రిలయన్స్ ఇండస్ట్రీస్కు సానుకూలాంశం. జూలై నెలలో ఎగుమతులు మందగించడంతో వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయికి చేరిన నేపథ్యంలో తాజాగా విండ్ఫాల్ ట్యాక్స్లను ప్రభుత్వం సవరించింది.
చమురు ఉత్పాదక సంస్థలు, పెట్రో ఎగుమతి కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నాయన్న కారణంతో జూలై 1న కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ను విధించింది. పెట్రోల్, ఏటీఎఫ్ల ఎగుమతులపై లీటర్కు రూ.6, డీజిల్పై రూ. 13 చొప్పున ట్యాక్స్ వడ్డించారు. టన్ను దేశీ క్రూడ్ ఉత్పత్తిపై రూ.23,250 మేర పన్ను విధించారు. జూలై 20న ఆ పన్నులను కొంతమేర తగ్గించిన విషయం తెలిసిందే.