భోపాల్: కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ మరోమారు స్పష్టం చేశారు. అవసరమైతే అందుకోసం లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధమని మధ్యప్రదేశ్లో జరిగిన భారీ బహిరంగ సభలో హెచ్చరించారు.
‘వివాదాస్పద మూడు కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోసం అవసరమైతే లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం నాడు 3,500 ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించాయి. అవన్నీ అద్దె ట్రాక్టర్లు కావు’ అని తికాయిత్ అన్నారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేరెత్తకుండానే ఆయనపై తికాయిత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మీరు ఎన్నుకున్న నేతకు ఎలాంటి అధికారాలు లేవు. ఆయన సొంతంగా ఎప్పుడూ మనకు సమాధానం ఇవ్వలేరు. చర్చలకు సైతం ఫైళ్లు పట్టుకుని వచ్చి, వాటి ఆధారంగానే సమాధానాలు చెప్పారు’ అని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్లోని మొరెనా లోక్సభా స్థానం నుంచి నరేంద్ర సింగ్ తోమర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నిరసనోద్యమానికి సారధ్యం వహిస్తున్న రాకేశ్ తికాయిత్ మధ్యప్రదేశ్లో పర్యటిస్తూ రైతుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తికాయిత్ పర్యటించి రైతులతో సమావేశం కానున్నట్లు బీకేయూ మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్ తెలిపారు.