హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 : సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు నిర్వహించి విద్వేషాలను రెచ్చగొట్టేవారిని, ఫొటోలను మార్ఫింగ్చేసి బెదిరింపులకు దిగేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఇలాంటి కేటుగాళ్లు విదేశాల్లో ఉన్నా వదలిపెట్టేదే లేదని, కఠిన చర్యలు చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. మంగళవారం తొలిసారి నగర పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇలాంటి నేరగాళ్లపై వేగంగా దర్యాప్తు నిర్వహించి లుకౌట్ నోటీసులు జారీచేయడంతోపాటు వారి పాస్పోర్టులు, వీసాల రద్దుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ అధికారులంతా ప్రజలకు న్యాయం చేసేలా వ్యవహరించాలని, పక్షపాత ధోరణితో ఎవరికీ అన్యాయం చేయవద్దని స్పష్టం చేశారు. పోలీసింగ్, సిబ్బంది పనితీరు ప్రజలు ఆశించిన రీతిలో ఉండాలని, ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా రోడ్లపై ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున నగరంలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు సీపీ చౌహాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.