కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే కేంద్ర సర్కారు వెంటనే సహకరిస్తుందా? లేక కొర్రలు పెట్టి సతాయిస్తుందా? కేంద్రంతో బెంగాైల్ సీఎం మమతా దీదీ సంబంధాల గురించి తెలిసందే. వామపక్ష కూటమి 50 సంవత్సరాల క్రితం మండలిని రద్దు చేసింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలకు శాసన మండళ్లు ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఆరు కాకుండా ఏడో రాష్ట్రంగా బెంగాల్ నిలువబోతున్నది. కేంద్రంలో రాజ్యసభను పిలిచినట్టుగానే రాష్ట్రాల్లో శాసనమండలిని ఎగువసభ, పెద్దలసభ అని పిలుస్తారు. అయితే శాసనమండలి ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండదు. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి ఓకే చేయిస్తేనే మండలి ఏర్పాటవుతుంది. అంటే ఈ అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మద్య ఘర్షణ అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
రెండు సభల వ్యవస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. మాంటేగ్-చెమ్స్ఫర్డ్ సంస్కరణలతో భారత్లో 1919లో రాష్ట్రాల సభ లేదా ఎగువ సభ ఏర్పడింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రావిన్సుల్లో అంటే రాష్ట్రాల్లో ఎగవ సభలకు వీలు కల్పించింది. ఆ చట్టం కింద 1937లో బెంగాల్లో శాసనమండలి ఏర్పాటైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు సభల వ్యవస్థపై చాలాపెద్ద చర్చే జరిగింది. తొందరపాటు చట్టాలు రాకుండా అడ్డుకునేందుకు కేంద్రం పార్లమెంటులో ఎగువ సభకు అంగీకరించిన సభ్యులు రాష్ట్రాలకు ఇదే తరహా రెండు సభల వ్యవస్థ విషయంలో మాత్రం ఎందుకో అంత ఉత్సాహం చూపలేదు.
రాష్ట్రాల్లో రెండో సభ వల్ల ఖర్చు దండగని, పార్టీ నేతలకు పదవుల పందేరానికి తప్ప అది ఎందుకూ పనికిరాదని చాలామంది వాదించారు. మొత్తం మీద మొదట్లో బీహార్, బాంబే, మద్రాస్, పంజాబ్, యూపీ, పశ్చిమబెంగాల్ ప్రావిన్సులకు రెండో సభను అనుమతించారు. ఈ రెండో సభ ఉండాలా వద్దా అనే నిర్ణయం రాష్ట్రాలకే వదిలేశారు. కాకపోతే పార్లమెంటు అనుమతి తప్పని సరి. మండలి స్థానాలను అసెంబ్లీ స్థానాల్లో మూడోవంతుకే పరిమితం చేశారు. ఏదైనా చట్టాన్ని లేదా నిర్ణయాన్ని మండలి తిరస్కరించినా ఖాతరు చేయకుండా ముందుకువెళ్లే అధికారాన్ని అసెంబ్లీకి కట్టబెట్టారు.