కోల్కతా: దేశంలో మంచి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీకి అక్కడ 100 సీట్లు కూడా రావని, ఒకవేళ బీజేపీకి గనుక బెంగాల్లో 100కు పైగా సీట్లు సాధిస్తే తాను ప్రస్తుతం చేస్తున్న వృత్తి నుంచి వైదొలిగి దీనికి పూర్తిగా భిన్నమైన వేరే వృత్తిలోకి వెళ్లిపోతానని శపథం చేశారు.
ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బెంగాల్లో బీజేపీకి వందకంటే ఎక్కువ స్థానాలు వస్తే రాజకీయ వ్యూహకర్తగా నా వృత్తికి గుడ్బై చెప్పేస్తా. నా సంస్థను మూసేస్తా. ఈ వృత్తికి పూర్తిగా భిన్నమైన వృత్తిని చేపడుతా. మరోసారి రాజకీయ ప్రచార వేదికలపై మీకు కనిపించను’ అని ఆయన వ్యాఖ్యానించారు. యూపీలో తన పాచికలు పారలేదని, అక్కడ తనకు స్వేచ్ఛ కల్పించలేదని చెప్పారు.
కానీ బెంగాల్లో పరిస్థితి అలా లేదని, అక్కడ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని కిషోర్ సంతృప్తి వ్యక్తంచేశారు. తృణమూల్ తనంతట తనను బలహీనపర్చుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చాలా ఉన్నాయని, బీజేపీ రాజకీయంగా ఆ లొసుగులను వాడుకుంటున్నదని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.