కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత కేంద్రంలో అధికారంపై దృష్టి సారిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో నుంచి తప్పిస్తామని ప్రమాణం చేశారు. ‘ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిస్తున్న ‘పోరిబోర్టన్’ నినాదం మాది. వారు దానిని కాపీ కొట్టి ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ గెలిచి ఢిల్లీలో కూడా పోరిబోర్టన్ తీసుకువస్తామని ఖరగ్పూర్లో జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ అన్నారు.
మార్చి 27 నుంచి రాష్ట్రంలో ఎనిమిది దశల ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి ముందు పశ్చిమ బెంగాల్లో అసోల్ పోరిబోర్టన్కు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2019 జాతీయ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ప్రస్తుత ఎన్నికల్లో 200 సీట్లకు పైగా గెలువాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి 100 సీట్లు కూడా రావని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తెలిపింది. ‘మమతా బెంగాల్లో గెలిస్తే అది వారికి పెద్ద ముప్పు అని వారికి తెలుసు. ఎందుకంటే ఆమె ఢిల్లీకి వచ్చి ఇతర పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పరుస్తుంది” అని మమతా బెనర్జీ అన్నారు. ఇక్కడ విజయం సాధించిన మరుక్షణమే కోల్కతా నుంచి ఢిల్లీకి మకాం మార్చి అక్కడ అధికారంలోకి రావడంపై కన్నేస్తామని చెప్పారు.
ఇంతకు ముందు మమతా బెనర్జీ తన మంత్రులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారని, ఇప్పుడు తనకు తానుగా సర్టిఫికేట్లు తీసుకుంటున్నారని బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా విరుచుకుపడ్డారు. ‘ఆమె మొదట బెంగాల్ను ఎదుర్కోనివ్వండి. తరువాత ఆమె ఢిల్లీ గురించి ఆలోచించవచ్చు. అయితే, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోనున్నది మాత్రం సుస్పష్టం. మమతా బెనర్జీని త్వరలో ప్రతిపక్ష నాయకురాలిగా చూడవచ్చు’ అని అన్నారు.