హుజూరాబాద్ : ప్రజల కోసం కానీ, హుజురాబాద్ నియోజకవర్గం పనుల కోసం కానీ కాకుండా సొంత అజండాతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, అలాంటప్పుడు ఈటల కు ఎందుకు ఓటేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను గత ఐదు నెలలుగా గమనిస్తున్నా.. ఒక్క రోజు కూడా రాజీనామాకు కారణం మాత్రం ఇప్పటి వరకు చెప్పనేలేదు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈటల తన బాధను, ప్రజల బాధగా మార్చేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు తప్ప అసలు అజండా మాత్రం చెప్పడం లేదని వినోద్ కుమార్ అన్నారు.
ప్రజలకు అన్యాయం జరిగింది అని కానీ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడం లేదని కానీ, పెన్షన్లు రావడం లేదని కానీ, రైతు బంధు, రైతు బీమా రావడం లేదని కానీ, ఫలానా పనులు కావాలని కోరితే రాలేదని కానీ ఎన్నడూ చెప్పలేని ఈటల రాజేందర్.. ఏ కారణం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సరైన కారణాలు చెప్పకుండా, సొంత అజండాతో పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ కు ప్రజలు ఎందుకు ఓటేయాలి..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఓట్లు అడిగే నైతిక హక్కు ఈటల రాజేందర్ కు లేదని, అతని పట్ల ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీకి, అధినేత, సీఎం కేసీఆర్ పట్ల వ్యతిరేక భావనతో, బహిరంగంగా విమర్శలు చేసిన ఈటల రాజేందర్ కు ప్రజలే తగిన రీతిలో జవాబు ఇస్తారని వినోద్ కుమార్ అన్నారు.
కాజీపేట-హుజురాబాద్-కరీంనగర్ రైల్వే లైన్ పనులు రిజెక్ట్ అయినా బండి పట్టించుకోరేంటీ..?
కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నర సంవత్సరాల కాలం గడిచినా బండి సంజయ్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా కొత్తగా తీసుకుని రాలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎంపీగా బండి సంజయ్ జిల్లా అభివృద్ధి కోసం పట్టుబట్టి పనులు చేయాలని సూచించారు. కాజీపేట-హుజురాబాద్-మానకొండూర్-కరీంనగర్ రైల్వే లైన్ పనుల ప్రతిపాదనలను రైల్వే శాఖ రిజెక్ట్ చేసిందని, ఆ పనులను సాధించేందుకు బండి సంజయ్ చిత్తశుద్ధితో కృషి చేయాలని వినోద్ కుమార్ సూచించారు.
గతంలో హైదరాబాద్-మనోహరాబాద్-గజ్వేల్-సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కరీంనగర్ రైల్వే లైన్ పనులను రైల్వే శాఖ రిజెక్ట్ చేస్తే కరీంనగర్ ఎంపీగా వెంటపడి, పట్టుబట్టి పనులను సాధించినట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా ఈ రైల్వే లైన్ పనులను సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని బండి సంజయ్ కు ఆయన సూచించారు.