వాషింగ్టన్ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతున్నది.. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినే ఆయుధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతుందని, దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని కొందరు టీకా వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో టీకాలు ఎందుకు తీసుకోవాలి? ఎంత ముఖ్యమో? అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరించారు.
టీకా తీసుకున్న వారికి కరోనా సోకినా ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆయన టీకా తీసుకున్న, తోసుకోని ఇద్దరు కొవిడ్కు పాజిటివ్గా పరీక్షించిన ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు చెందిన ఎక్స్రేలను పోల్చి చూపించారు. టీకా తీసుకున్న వ్యక్తుల్లో తీవ్రత తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే వేగంగా కోలుకోవడంతో పాటు కొవిడ్ అనంతర సమస్యలు సైతం తక్కువగా ఉంటాయని ఎస్ఎస్ఎం హెల్త్, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఘసన్ కమెల్ తెలిపారు. ఆయన గతేడాది మార్చి నుంచి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ వైరస్ న్యుమోనియా ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. వైరస్ సోకితే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి, వాపు వస్తుందని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో వ్యాక్సిన్ తీసుకోని, తీసుకున్న వ్యక్తుల ఎక్స్రే ఫిల్మ్లతో పోల్చి చూపారు. టీకా తీసుకొని వ్యక్తుల్లో వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నది. ఊపిరితిత్తులు నీటితో (తెల్లని మచ్చలు మొదటి ఎక్స్రేలో చూడొచ్చు) నిండిపోయాయి. దీని ద్వారా శ్వాస తీసుకొనే సమయంలో ఆక్సిజన్ వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో కలుగుతుంది. వ్యాక్సిన్ వేసుకొని కొవిడ్కు పాజిటివ్గా పరీక్షించిన వ్యక్తుల్లో వైరల్ లోడ్ తక్కువగా (తెల్లని మచ్చలు ఎక్కువ లేకపోవడం రెండో ఎక్స్రేలో చూడొచ్చు) ఉన్నది.
ఊపిరితిత్తులలో చిన్న రంధ్రాలు ఉంటాయి. కరోనా రోగుల ఊపిరితిత్తుల్లో నీరు చేరిన కారణంగా ఈ రంధ్రాలకు ఆక్సిజన్ సరిగా చేరదు. ఫలితంగా దగ్గు, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. టీకాలు తీసుకొని రోగుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో పాటు ఆక్సిజన్, లేదంటే వెంటిలేటర్పై ఉంచి చికిత్సలు అందించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, అదే టీకాలు తీసుకున్న వారికి వెంటిలేటర్ అవసరం తక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.