కోల్కతా: తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. నారదా టేపుల వ్యవహారంలో సీబీఐ సోమవారం సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీం, మదన్ మిత్రా, సోవన్ చటర్జీలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి కొన్ని పనులు చేసిపెట్టినందుకు తృణమూల్ నాయకులు ముడుపులు స్వీకరించడాన్ని నారదా న్యూస్ వీడియో టేపుల్లో రికార్డు చేసింది. 2016కు ముందు జరిగిన ఈ కేసులో ఇప్పుడు అరెస్టులు జరగడం సంతోషమేనని, అయితే తృణమూల్ నుంచి బీజేపీలోకి మారిన సువేందు అధికారిని అరెస్టు చేయకపోవడం ఏమిటని మాథ్యూ ప్రశ్నించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రాం నుంచి సీఎం మమత బెనర్జీపై బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించిన సువేందును వదిలి పెట్టడం దేనికో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అరెస్టయిన నలుగురిలో ఇద్దరు తృణమూల్ మంత్రులు, ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే. “సువేందు అధికారికి ఆయన ఆఫీసుకు వెళ్లి డబ్బిచ్చాను. కానీ ఆయన పేరు అరెస్టుల జాబితాలో లేదు. ఫారెన్సిక్ పరీక్షల్లోనూ సువేందు డబ్బు తీసుకున్నట్టు రుజువైంది. సీబీఐ నా స్టేట్మెంట్ కూడా తీసుకుంది. కానీ ఏం జరిగిందో తెలియదు” అని మాథ్యూ అన్నారు. అయితే సువేందు మీద కేసు బుక్ అయినప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు. అందువల్ల ప్రాసిక్యూషన్కు సీబీఐ లోక్సభ స్పీకర్ అనుమతి కోరింది. బెంగాల్ మంత్రుల విషయంలో మాత్రం బెంగాల్ స్పీకర్ నుంచి కాకుండా గవర్నర్ అనుమతి కోరింది. ఆయన అనుమతి ఇవ్వడంతో మంత్రులను, ఇతరులను అరెస్టు చేసింది. కానీ సువేందు విషయంలో ఇంకా లోక్ సభ స్పీకర్ అనుమతి రాలేదని సీబీఐ అంటున్నది.