న్యూఢిల్లీ: వాతావరణం కాలుష్యం నియంత్రణ కోసం పూర్తిగా పాతబడిన వాహనాలు, స్క్రాప్ వాహనాలను రీప్లేస్ చేసి కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి ఎందుకు ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ ప్రశ్నించారు. ఒకవేళ సదరు వాహనం అన్ఫిట్ అయితే, కొత్త కారు లేదా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారుడు ఏదేనీ ఇన్సెంటివ్లు ఎందుకు ఇవ్వాలని నిలదీశారు. ప్రతి ఒక్కరికి ప్రమాదకరమైన వాహనాలను అనుమతించొద్దని పేర్కొన్నారు. పెట్రోల్ లీటర్ ధర రూ.90 దాటినా వినియోగదారులు బైక్లు, స్కూటర్లు, కార్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని భార్గవ గుర్తు చేశారు.
కరోనాతోపాటు అంతకుముందు ఆర్థిక మాంద్యంతో కుదేలైన ఆటోమొబైల్ రంగానికి పునరుత్తేజాన్నిచ్చేందుకు కేంద్రం స్క్రాపేజీ పాలసీని తీసుకొచ్చింది. స్క్రాప్ కింద ఇచ్చే పాత వాహనాల స్థానే కొత్త వాహనం ధరపై ఐదు శాతం రాయితీ ఇవ్వాలని ఆటోమోబైల్ సంస్థలను కేంద్రం కోరింది. దీనిపై మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ ప్రతికూలంగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే, కేంద్రం పూర్తిగా పాత వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణను 2024 నుంచి నిలిపివేయనున్నది.