లండన్: బ్రిటిష్ భారత్కు చివరి వైస్రాయ్, స్వతంత్ర భారత్కు మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్బాటన్ లేఖలు, డైరీల్లో ఏముంది? తాజాగా వాటి వెల్లడికి మరోసారి బ్రిటన్ సర్కారు మోకాలడ్డు పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇవీ ఆండ్రూ లౌనీ అనే రచయిత సంధిస్తున్న ప్రశ్నలు. ప్రస్తుతం సౌథాంప్టన్ యూనివర్సిటీ దగ్గర ఆ లేఖలు, డైరీలు ఉన్నాయి. యూనివర్సిటీ వాటిని 2010లో పెద్దఎత్తున సొమ్ము ఖర్చు చేసి కొనుగోలు చేసింది. ఇక అందరికీ అవి అందుబాటులోకి వచ్చినట్టే అనుకున్నారు. కానీ యూనివర్సిటీ వాటిని బహిర్గతం చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటూ వస్తున్నది. 2019లో ఆండ్రూ లౌనీ మౌంట్బాటన్పై ఓ పుస్తకం రాశారు. 2017 నుంచి వాటిని బహిర్గతం చేయాలంటూ సమాచార స్వేచ్ఛ హక్కు కింద పోరాటం చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలలో ఆయన ఈ న్యాయపోరాటానికి 2.5 లక్షల పౌండ్ల సొంత డబ్బు ఖర్చు చేశారు. సమాచార కమిషనర్ వాటి విడుదలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ కొంత భాగం మాత్రం విడుదల చేయడానికి వీల్లేదని తాజా ప్రభుత్వం జోక్యం చేసుకుంది. భారత్ కు స్వాతంత్ర్యం ఇచ్చే సమయంలో జరిగిన పరిణామాలపై కొత్త వెలుగు ప్రసరించే సమాచారం వాటిల్లో ఉంటుందని అందరూ ఆశించారు. భారత్-పాక్ విభజన మొదలుకుని ఎన్నో విషయాలు వెలుగుచూస్తాయని అనుకున్నవారికి నిరాశే ఎదురైంది. ఇంతకూ పత్రాల విడుదలను ప్రభుత్వం ఇంత గట్టిగా ఎందుకు ప్రతిఘటిస్తున్నదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో సంగతి లేకుండా సర్కారు ఇలా చేయదు కదా అని రచయిత లౌనీ అంటున్నారు. 1979లో బోటు షికారులో ఉన్న మౌంట్ బాటన్ ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ (ఐఆర్ఏ) అనే వేర్పాటువాద సంస్థ ఏర్పాటు చేసిన శక్తివంతమైన బాంబు పేలినప్పుడు అక్కడికక్కడే మరణించారు.