నాగపూర్, అక్టోబర్ 18: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహామహులున్న కాషాయ కంచుకోట ’హస్త’గతమైంది. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో పంచాయతీ చైర్పర్సన్లు, డిప్యూటీ చైర్పర్సన్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చలాయించింది. బీజేపీ ఒక్క చైర్పర్సన్ పదవిని కూడా దక్కించుకోలేకపోయింది. కేవలం మూడు డిప్యూటీ చైర్పర్సన్లతో సరిపెట్టుకున్నది. ఈ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగ్గా, అదేరోజున ఫలితాలు వెలువడ్డాయి. 13 చైర్పర్సన్లకుగానూ కాంగ్రెస్ పార్టీ 9, 13 డిప్యూటీ చైర్పర్సన్లకుగానూ 8 స్థానాలను కైవసం చేసుకున్నది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఒక చైర్పర్సన్ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. దీంతో బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్రమంత్రి నితిన్గడ్కరీ స్వస్థలమైన నాగపూర్ జిల్లాలో కాషాయ పార్టీకి షాక్ తగిలింది. బీజేపీ సైద్ధాంతిక మూలాధారమైన రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్లో ఘోర పరాభవం ఎదురుకావడం ఆ పార్టీ అవమానంగా భావిస్తున్నది. నాగపూర్ పంచాయతీ సమితి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తీరు చూస్తుంటే ప్రజల్లో బీజేపీ విశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తున్నదని మాజీ మంత్రి, కాంగ్రెస్ గ్రామీణ విభాగం చీఫ్ రాజేంద్ర ములక్ పేర్కొన్నారు.