ముంబై : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల కంటే మహారాష్ట్రకు చాలా తక్కువ వ్యాక్సిన్ డోసులు వచ్చాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్తో తనతో పాటు శరద్ పవార్ సైతం మాట్లాడారని, టీకాల సరఫరాపై వివక్షను లేవనెత్తినట్లు తెలిపారు. 12కోట్ల జనాభాతో ఎక్కువ మంది క్రియాశీల రోగులు, పాజిటివిటీ రేటు, మరణాలు ఎక్కువ ఉంటే ఎలా టీకాలు తక్కువ ఇస్తారని ప్రశ్నించారు.
ఈ మేరకు త్వరలోనే దిద్దుబాట్లు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. ప్రతి రోజు ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నందున మాకు నెలకు 1.5 కోట్ల డోసులు.. వారానికి 10లక్షల డోసులు కావాలన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడానికి బదులుగా.. వాటిని దేశంలోని అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయాలన్నారు. మహారాష్ట్ర జనాభాలో గుజరాత్ సగం ఉంటుందని, ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి కోటి వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. కేంద్రం తాజాగా వ్యాక్సిన్ రిలీజ్ ఆర్డర్లో మహారాష్ట్రకు 7.5లక్షల మోతాదులే ఇచ్చిందన్నారు. ప్రస్తుతం దీన్ని 17లక్షలకు పెంచినట్లు సమాచారం అందిందని చెప్పారు. అయినా ఇవి సరిపోవని, 40లక్షలకు పెంచాలని కోరారు.