Bheemla Nayak | పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు ఇప్పుడు చాలామందికి ఈ అనుమానం ఉంది. భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది..? ఇదేం ప్రశ్న.. కచ్చితంగా దర్శకుడికి వెళ్తుంది కదా అనుకుంటున్నారా..? కానీ ఇక్కడ అసలు చిక్కు ప్రశ్న ఒకటి ఉంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అంటే సాగర్ కే చంద్ర పేరు వినిపిస్తుంది.. కానీ తెర వెనుక మాత్రం మొత్తం చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంగా దర్శకుడు సాగర్ కూడా ఈ సినిమాకు బ్యాక్ బోన్ త్రివిక్రమ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన లేకుంటే సినిమా సాధ్యమయ్యేది కాదు అంటూ చెప్పాడంటే త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అనేది అర్థం అవుతుంది.
మరి ఈ సందర్భంలో భీమ్లా నాయక్ సినిమా విజయం తాలూకు క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే.. మరో అనుమానం లేకుండా త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మొన్న జరిగిన సక్సెస్ మీట్లో కూడా ఎక్కువగా త్రివిక్రమ్ గురించే అందరూ మాట్లాడారు. దర్శకుడు సాగర్ కె.చంద్ర.. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, రాధాకృష్ణ సైతం త్రివిక్రమ్ గురించి ఎక్కువగా మాట్లాడారు. ఆయన లేకపోతే సినిమా లేదు. మొదటి నుంచి చివరి వరకు అన్నీ చూసుకున్నది త్రివిక్రమ్ ఒక్కడే అంటూ ఆకాశానికి ఎత్తేశారు. పైగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. రీమేక్ రైట్స్ తీసుకున్నప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్లు మార్చాలో అర్థం కాక చాలా రోజుల వరకు కష్టపడ్డాం అంటూ చెప్పుకొచ్చాడు.
పైగా ఈ సినిమా స్క్రీన్ ప్లే కోసం చాలా రోజుల సమయం తీసుకున్నట్లు చెప్పాడు మాటల మాంత్రికుడు. సాగర్ కే చంద్ర కేవలం కో ఆర్డినేట్ చేసుకున్నాడు అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. మొన్న త్రివిక్రమ్ మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఇది నిజమే అనిపిస్తుంది. ప్రతి విషయం త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకున్నాడు. మహేశ్ బాబుతో చేయబోయే తన సినిమాను సైతం పక్కన పెట్టి మరీ పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆలోచించాడు త్రివిక్రమ్. పైగా భీమ్లా నాయక్ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది అంటే దానికి కారణం కేవలం పవన్ మాత్రమే కాదు త్రివిక్రమ్ కూడా. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా రేంజ్ మారిపోయింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే 53 కోట్ల షేర్ వసూలు చేసింది.