టీమిండియా కెప్టెన్ అంటే.. ప్రపంచ క్రికెట్కే కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా బీసీసీఐ బలంగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆ నాడు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం ఇండియా క్రికెట్ చరిత్రలో కొత్త రూపు సంతరించుకొన్నది. అప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ అనే బాధ్యత చాలా గొప్పగా మారింది. ఆ పదవిని అంత గొప్పగా మార్చాడు గంగూలీ. గంగూలీ తర్వాత ద్రవిడ్ కొన్ని రోజులే కెప్టెన్గా కొనసాగాడు. ధోనీ రూపంలో టీమిండియాకు గొప్ప నాయకుడు దొరికాడు. వచ్చీ రావటంతోనే కుర్రాళ్లతో కలిసి టీ20 కప్ను సాధించిపెట్టాడు. అప్పటికే ప్రపంచ క్రికెట్కు పెద్దన్నగా ఎదుగుతున్న బీసీసీఐకి ధోనీ తోడయ్యాడు. దాంతో టీమిండియా తిరుగులేని శక్తిగా మారింది. కూల్గా ఉంటూ, హుందాగా వ్యవహరిస్తూ జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చాడు ధోనీ. సీనియర్లను గౌరవిస్తూ, జూనియర్లకు విరివిగా అవకాశాలు కల్పిస్తూ తన మార్కును చూపించాడు.
రికీపాంటింగ్ను మించి..
అప్పటిదాకా ప్రపంచ క్రికెట్లో గొప్ప కెప్టెన్లలో ఒకడిగా కొనసాగిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ను మించి ధోనీ వెలుగొందాడు. అప్రతిహత విజయాలు, ట్రోఫీలను అందిస్తూ భారత క్రికెట్కు వన్నె తెచ్చాడు. టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ.. 3 ఐసీసీ ట్రోఫీలను సాధించి పెట్టాడు. కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలి అని ప్రపంచ క్రికెట్ పండితులు వేనోళ్ల పొడిగేలా ధోనీ వ్యవహరించాడు. ధోనీ తీరు సొంతంగా అతడికే కాదు.. భారత క్రికెట్ జట్టుకు, బీసీసీఐకి పేరు, ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.
ధోనీ తర్వాత..
ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. ధోనీ శైలికి భిన్నంగా కోహ్లీకి దూకుడెక్కువ. ఆ దూకుడు మాటల్లో, చేతల్లో, బ్యాటింగ్తో, ఫీల్డింగ్తో, నాయకత్వంలో చూపించేవాడు. ఓ రకంగా గంగూలీకి జిరాక్స్ అన్నట్టు కోహ్లీ తీరు ఉండేది. ధోనీ వారసుడిగా వచ్చిన కోహ్లీ విజయాల పరంపరను కొనసాగించాడు. త్వరలోనే టీ20 జట్టుకు కెప్టెన్గా వైదొలుగుతానని ప్రకటించాడు. కోహ్లీ తర్వాత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అవుతాడని అంతా అంటున్నారు. దీన్ని ఎవరూ ఖండించరు. ఖండించలేరు. ఎందుకంటే.. కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డులను చూస్తే సరి.
రోహిత్ శర్మ ఎంతకాలం..?
ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ‘రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 34 ఏండ్లు. అతడు మహా అయితే.. మరో మూడు, నాలుగేండ్లు కెప్టెన్గా ఉండగలడేమో. కానీ, ఆ తర్వాత ఎవరు? ధోనీ, కోహ్లీ 30 ఏండ్లలోపే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి, జట్టును నడిపించారు. కానీ, రోహిత్ శర్మ వ్యవహారం వచ్చేసరికి వేరు. ఇదే సమయంలో బీసీసీఐ పెద్దలు కూడా తదుపరి కెప్టెన్ ఎవరనేదానిపై కసరత్తు ప్రారంభించి ఉండవచ్చు. గంగూలీ, ధోనీ, కోహ్లీలా.. జట్టును నడిపించే నాయకుడు ఎవరు అవుతారు అనేది ఉత్కంఠగా మారింది’ అని అంటున్నారు.
అందరి చూపు అతనిపైనే..
రోహిత్శర్మ ఉన్నన్ని రోజులు టీ20 కెప్టెన్గా కొనసాగవచ్చు. అంటే.. మరో నాలుగైదేండ్లు. ఆ తర్వాతైనా జట్టుకు కొత్త నాయకుడు రావాల్సిందే. ఇప్పుడున్న టీమిండియాను చూస్తే కెప్టెన్ అయ్యే పూర్తి అర్హతలు కేఎల్ రాహుల్కు ఉన్నాయని క్రీడాపండితులు చెప్తున్నారు. ‘ఫార్మాట్కు తగ్గట్టు బ్యాటింగ్ శైలిని మార్చుకోవటంలో కేఎల్ రాహుల్ ముందుంటాడు. టీ20ల్లో దూకుడుగా, వన్డేల్లో నిలకడగా, టెస్టుల్లో ఓపికగా బ్యాటింగ్ చేస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు.’ అని అంటున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా లిస్టులో ఉన్నా, అనుభవం దృష్ట్యా రాహుల్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. చూడాలి మరి.. ఎవరు టీమిండియా భావి కెప్టెన్ అవుతారో..!