లండన్, జూలై 23: అనేక దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఎట్టకేలకు శనివారం గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మంకీపాక్స్ను ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలు వ్యాధిపై సమన్వయంగా స్పందిస్తూ పోరాడాలని డబ్ల్యూహెచ్వో పిలుపునిచ్చింది. 70కి పైగా దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తి చెందడం అసాధారణ పరిస్థితి అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఈ ఏడాది మే నుంచి 74 దేశాల్లో 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. అయితే ఆఫ్రికాలో మాత్రమే మంకీపాక్స్ వలన మరణాలు నమోదయ్యాయి. భారత్లో కూడా ఇప్పటికే మూడు మంకీపాక్స్ కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంకీపాక్స్కు నిర్దిష్ట చికిత్స అనేది లేదు. ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రోగులు స్పెషలిస్టు దవాఖానాలో చేరి లక్షణాలకు చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.
అత్యయిక పరిస్థితిపై డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరనప్పటికీ అథనోమ్ ఎమర్జెన్సీ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. యూఎన్ హెల్త్ ఏజెన్సీ చీఫ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. డబ్ల్యూహెచ్వో ఒక వ్యాధిని అత్యయిక పరిస్థితిగా ప్రకటించిందంటే..అది అసాధారణ పరిస్థితి అని, ఓ దేశ సరిహద్దులు దాటి ఆందోళనకరరీతిలో ఇతర దేశాలకు వ్యాప్తి చెందుతున్నదని, ప్రపంచ దేశాలు సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని పిలుపునిచ్చినట్టు అర్థం. వ్యాధి వ్యాప్తిపై ప్రపంచ వనరులతో పాటు అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఎమర్జెన్సీ ప్రకటన చేస్తుంది. కరోనా మహమ్మారి, 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్, 2016లో లాటిన్ అమెరికాలో జికా వైరస్ ఉధృతి వంటి ప్రజాఆరోగ్య సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో డబ్ల్యూహెచ్వో ఇంతకుముందు గ్లోబల్ ఎమర్జెన్సీలను ప్రకటించింది.
వాషింగ్టన్, జూలై 23: 98 శాతం మంకీపాక్స్ రోగులు స్వలింగ సంపర్కులని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 16 దేశాల్లో నమోదైన 528 మంకీపాక్స్ కేసులపై ఈ నెల 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ ఆర్టికల్ను ప్రచురించింది.
పురుషుల మధ్య లైంగిక సంబంధాలు మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి దారితీసే అవకాశం ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నది. 16 దేశాల్లోని 43 ప్రాంతాల్లో ఏప్రిల్ 27 నుంచి జూన్ 24 వరకు అధ్యాయనం జరిపి 528 మంకీపాక్స్ కేసులను గుర్తించినట్టు ఆర్టికల్లో పేర్కొన్నారు.