న్యూయార్క్ : పేద దేశాలు కరోనా వ్యాక్సిన్ తొలిడోసు కోసం నిరీక్షిస్తున్న దశలో బూస్టర్ డోస్ను ముందుకు తేవడాన్ని కుంభకోణంగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనం గెబ్రియసస్ అభివర్ణించారు. అల్పాదాయ దేశాల్లో ప్రతిరోజూ పంపిణీ చేసే కొవిడ్-19 వ్యాక్సిన్ సింగిల్ డోసుల కంటే ప్రపంచవ్యాప్తంగా ఆరు రెట్లు అధికంగా బూస్టర్ డోసులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, ఇతర అధిక ముప్పు కలిగిన వారు వ్యాక్సిన్ తొలి డోసు కోసం వేచిచూస్తుంటే ఆరోగ్యంగా ఉండి వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వడం అవివేకమని అన్నారు.
రోగనిరోధకవ్యవస్ధ బలహీనంగా ఉన్నవారికి మాత్రమే బూస్టర్ డోసులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంతమందికి వ్యాక్సినేషన్ పూర్తయిందనేది ముఖ్యం కాదని, ఎవరికి వ్యాక్సినేషన్ పూర్తయిందనేదే కీలకమని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటివరకూ 144 దేశాల్లో కొవాక్స్ వ్యాక్సిన్ పంపిణీ ద్వారా 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేశామని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ తెలిపారు.