సొంతింటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మరి చాలామంది తమ కలను సాకారం చేసుకోవాలని అనుకుంటుంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు సువర్ణ అవకాశం. ఎందుకంటే అనేక బ్యాంకులు గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించగా.. తాజాగా ఐసీఐసీఐ కూడా అదేబాటలో వడ్డీ రేట్లను తగ్గించింది.
మొదట కోటక్ మహీంద్రా బ్యాంకు హోం లోన్లపై వడ్డీ రేటను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ మేరకు 2021 మార్చి 1న నిర్ణయం తీసుకుంది. 6.65 శాతం నుంచే హోం లోన్లు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రూ.75 లక్షల వరకు రుణాలు తీసుకునే వారికి 6.70 శాతానికే హోం లోన్లు అందించనున్నట్లు పేర్కొంది. ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసింది. మహిళలకు ప్రత్యేకంగా 5 బేసిస్ పాయింట్ల రాయితీని కల్పించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.75 శాతానికే హోం లోన్లు ఇవ్వనున్నట్లు మార్చి 4న ప్రకటించింది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్.. హోం లోన్పై వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గిస్తూ మార్చి 5న నిర్ణయం తీసుకుంది.
కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల కొనుగోళ్లు, అమ్మకాలు పెద్దగా జరగలేవు. 2020 జనవరిలో 17.5 శాతంగా ఉన్న హోం లోన్ల వృద్ధి 2021లో 7.7శాతానికి తగ్గింది. దీంతో మందగమనంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు హోం లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు పోటాపోటీగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ క్రమంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
కొత్తగా హోం లోన్ తీసుకునే వారికి తగ్గిన వడ్డీరేట్లు వర్తిస్తాయి. ఇప్పటికే హోం లోన్ తీసుకున్న రుణగ్రహీతలకు వర్తించదు. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తేనే ప్రస్తుత రుణ గ్రహీతలు లాభపడతారు. హోం లోన్ రేట్లను బ్యాంకులు 2019 అక్టోబర్ 1 నుంచి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్లతో అనుసంధానించాలని ఆర్బీఐ ఆదేశించింది. దీంతో చాలా బ్యాంకులు రెపో రేట్లను తమ బెంచ్మార్కుగా ఎంచుకున్నారు. రెపో రేటు ఆధారిత గృహ రుణాలను రెపో రేటు ప్రకారమే లెక్కిస్తారు.
మీ హోం లోన్పై అధిక వడ్డీ ఉన్నట్లయితే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ను ఎంచుకోవడం ద్వారా లబ్ది పొందవచ్చు. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటుకు.. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకునే బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటులో తేడా కనీసం 50 బేసిస్ పాయింట్లు ఉండాలి. అలాగే లోన్ కాల పరిమితి కూడా 10 ఏళ్లకు మించి ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది. ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు స్టాంప్ డ్యూటీ, ప్రాసెసింగ్ ఫీజుతో సహా ఇతర ఛార్జీలను కూడా చూసుకోవాలి. కొన్ని బ్యాంకులు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు డాక్యుమెంటేషన్, లీగల్, వాల్యూయేషన్, ఇతర టెక్నిక్ ఫీజులను కూడా వసూలు చేస్తాయి.
ఉదాహరణకు ఒక వ్యక్తి 20 ఏళ్ల గడువుతో 7 శాతం చొప్పున రూ.30 లక్షల రుణం తీసుకుంటే.. ప్రతి నెల 23,259 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20 ఏళ్ల గడువు ముగిసే సరికి వడ్డీ మొత్తం రూ.25,82,153 అవుతుంది. అదే వడ్డీ రేటు 6.70 శాతానికి తగ్గితే ఈఎంఐ 22,772 అంటే, మొత్తం వడ్డీ రూ.24,53,240కి తగ్గుతుంది. అలాగే వడ్డీ రేటు తగ్గినప్పుడు అదే ఈఎంఐ చెల్లిస్తూ గడువును తగ్గించుకోవచ్చు. నిజానికి వడ్డీ రేటు తగ్గినప్పుడు ఈఎంఐ తగ్గించుకోకుండా గడువును తగ్గించుకుంటేనే అదనంగా పొదుపు చేసుకోవచ్చు.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బ్యాంకులతో పోటీ పడి మరి తక్కువ వడ్డీ రేట్లకే హోం లోన్లు అందిస్తున్నాయి. వీటిలో ఆంక్షలు కూడా తక్కువగా ఉంటాయి. బ్యాంకేతర సంస్థలు ప్రైమ్ లెండింగ్ రేట్ (పీఎల్ఆర్) ఆధారంగా హోంలోన్లు ఇస్తాయి. అంటే వడ్డీ రేట్లు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్తో లింక్ ఉండవు. అందువల్ల బ్యాంకుల్లో వడ్డీ రేట్లు మారినంత పారదర్శకంగా ఎన్బీఎఫ్సీల్లో వడ్డీరేట్లు మారవు. అయితే.. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వారికి మాత్రం బ్యాంకేతర సంస్థల్లో రుణాలు సులభంగా లభిస్తాయి.
గృహ రుణ రేట్లు ఇప్పటికే 15 ఏళ్ల కనిష్టస్థాయికి చేరుకున్నాయని.. బాండ్ల దిగుబడి పెరుగుతుండటంతో ఆర్బీఐ మరోసారి రెపో రేటును తగ్గించే అవకాశం కనిపించడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అందువల్ల హోం లోన్లు తీసుకోవాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.