కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి చెబుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తమ పార్టీ వాళ్లపై దాడులకు పాల్పడిన అందరిపైనా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మిడ్నాపూర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్పైన, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైన యోగి మండిపడ్డారు.
‘మే 2 తర్వాత పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యర్తలపై టీఎంసీ నేతలు అనేక దాడులకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో గూండా పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే అందుకు కారణమని, ఆమె ప్రోద్బలంతోనే యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.