పుణె: ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ చెప్పారు. సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి మార్గాలు వెతకాల్సి ఉంటుందన్నారు. అందుకు ఒక వ్యవస్థ అవసరం అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల సారధ్యంలోని మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం సజావుగా, ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని ఆదివారం బారామతిలో పవార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఒక ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికన తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారానికి వ్యవస్థ రూపకల్పనపై తమ సర్కార్ క్రుషి చేస్తుందన్నారు. మూడు పార్టీల నుంచి ఇద్దరేసి నేతల చొప్పున ఆరుగురు నేతలు ఏదైనా అంశం లేదా విధానంపై నిర్ణయం తీసుకుంటారన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి బాలా సాహెబ్ థోరాట్, అశోక్ చవాన్, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్ ఈ కమిటీలో ఉన్నారు. వీరు సమావేశమై విధాన నిర్ణయాలపై ఏకాభిప్రాయానికి వస్తారు.
కూటమిలోని మూడు పార్టీలు మంచి అవగాహనతో పని చేస్తున్నాయని శరద్ పవార్ చెప్పారు. ఆయా పార్టీల నేతలు తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటారన్నారు.
ఇటీవల మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్ స్పందిస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో అధికార కూటమిలో విభేదాలు ఉన్నాయని వదంతులు వ్యాపించాయి.