న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ మంగళవారం మధ్యాహ్నం కొద్దిసేపు పడకేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు మెసేజ్లు పంపేందుకు, రిసీవ్ చేసుకొనేందుకు వీలుకాలేదు. దీంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆ వెంటనే వాట్సాప్ మాతృ సంస్థ ‘మెటా’ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడంతో సేవలు పునఃప్రారంభమయ్యాయి.
అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాట్సాప్ పనిచేయడం లేదని, మంగళవారం మధ్యాహ్నం 12.47 నుంచి ఈ సమస్య మొదలైందని ‘డౌన్డిటెక్టర్’ వెబ్సైట్ ధ్రువీకరించింది. దీనిఫలితంగా ఆసియా, యూర ప్, ఆఫ్రికా ఖండాల్లోని వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్ వినియోగదారులకు సైతం ఈ సమస్యలు ఎదురైనట్టు పేర్కొన్నది. దీంతో వినియోగదారులకు క్షమాపణ చెప్పన ‘మెటా’ సంస్థ.. మధ్యాహ్నం 2.30 గంటలకు సేవలను పునరుద్ధరించింది.