న్యూఢిల్లీ: మీ ఇంట్లో ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసిన వాట్సాప్ యాప్ నుంచి ఇతరులతో చాటింగ్ చేస్తున్నప్పుడు.. ఓ వ్యక్తి మీకు కాల్ చేశారనుకోండి.. ఆ వెంటనే ఆయనతో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్లో ఉంది. సదరు వ్యక్తితో వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుతూ కంప్యూటర్లో ఉన్న వివరాలు చెప్పాలి. ఇప్పుడైతే దీని కోసం సిస్టమ్, మొబైల్ రెండూ వాడాల్సి ఉంటుంది.
ఇక ముందు ఇటువంటి ఇబ్బందుల నుంచి మీకు త్వరలో విముక్తి లభించనున్నది. డెస్క్టాప్ వాట్సాప్ యాప్లో వీడియో, వాయిస్ కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు మొబైల్ వెర్షన్కి మాత్రమే పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్ ఇప్పుడు డెస్క్టాప్ వాట్సాప్ యాప్కి కూడా వచ్చేసింది.
గతేడాది డిసెంబర్లో ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్ను వాట్సాప్ కొంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా అందరికీ అందిస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్ట్రిప్షన్ టెక్నాలజీ ఉంటుంది.
డెస్క్టాప్/ల్యాప్టాప్లో మీరు కాల్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ క్లిక్ చేసి.. దిగువ కనిపించే కాల్ బటన్ క్లిక్ చేస్తే సరి. వీడియో, వాట్సాప్ కాల్లో మాట్లాడవచ్చు. భవిష్యత్లో ఈ ఫీచర్ను విస్తరించి, గ్రూప్ కాల్స్ కూడా మాట్లాడుకునే ఆప్షన్ అందించనున్నట్లు వాట్సాప్ యాజమాన్యం తెలిపింది.
మనం వాట్సాప్ వాడకం ప్రారంభంలో ‘బ్లూటిక్స్’ గురించి విన్నాం. అవసరమైతే ఆప్షన్ని ఎనేబుల్ చేసి వాట్సాప్ని వాడుతున్నాం. వాటిని ఎనేబుల్ చేయడం వల్ల మీకు వచ్చిన మెసేజ్లు మీరు చదివారని పంపిన వారికి తెలిసేలా చేసేవే ఈ బ్లూటిక్స్. ఒకవేళ వీటిని రీడ్ రిసిప్ట్లో డిసేబుల్ చేస్తే బ్లూటిక్స్ కనిపించవు.
బ్లూ టిక్స్ విధానం ఇప్పటి వరకూ కేవలం మెసేజ్ల వరకే పరిమితం అయ్యింది. కానీ, ఎవరైనా వాయిస్ మెసేజ్లు పంపితే వాటికి అప్లై అవ్వదు. మీరు విన్నారని బ్లూటిక్స్తో వారికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆపిల్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన కొత్త అప్డేట్తో వాయిస్ మెసేజ్లకు కూడా బ్లూటిక్స్ కనిపించవు. దీంతో మీరు వాయిస్ క్లిప్ని విన్నారనే విషయం వారికి తెలియదు.