న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్తో ఆదివారం మ్యాచ్ అనంతరం కోహ్లీ విలేకరులతో మాట్లాడుతూ టెస్టు కెప్టెన్సీ వదులుకున్నపుడు కేవలం ధోని మాత్రమే తనకు సందేశం పంపాడని, తన నంబర్ తెలిసిన ఇతరులెవరూ సందేశాలు పంపలేదని కోహ్లీ వ్యాఖ్యానించడంపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసహనం ప్రదర్శించాడు. కోహ్లీ ఎవరినుంచి ఎలాంటి సందేశం ఆశించాడో, ఆ క్రికెటర్ పేరు వెల్లడించాలని సూచించాడు. కోహ్లీ వ్యాఖ్యలపై ఒక చర్చావేదికలో గవాస్కర్ స్పందిస్తూ కోహ్లీ తనతో ఆడిన మాజీ ఆటగాళ్ల గురించి మాట్లాడదలచుకుంటే ఎవరి నుంచి ఎలాంటి సందేశం ఆశించాడో వారినే అడిగి ఉండాల్సింది అన్నాడు. ప్రోత్సాహం కోరుకుంటే అది అతడు కెప్టెన్గా వ్యవహరిస్తున్నపుడే అందుకున్నాడని, కెప్టెన్సీ వదులుకున్న తరువాత ఆటపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించాడు. తన విషయంలోనూ ఇటువంటి సందర్భం ఎదురైందని గుర్తుచేసుకున్నాడు.