భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలకు దారి తీసిన అంశాల్లో కుంబ్లే సాగా ఒకటి. 2016లో భారత జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే.. రెండేళ్ల కాలం పూర్తవకుండానే ఏడాది తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన రాజీనామా లేఖను పంచుకున్న లెజెండరీ స్పిన్నర్.. ‘కెప్టెన్కు నా పద్ధతులతో ఇబ్బందిగా ఉందని తెలిసింది’ అంటూ బాంబు పేల్చాడు.
అంతే కోహ్లీపై చాలామంది క్రికెట్ ప్రేమికులు కత్తులు దూశారు. తాజాగా టీమిండియా కెప్టెన్సీ కోల్పోయిన కోహ్లీని.. ఆ విషయం గుర్తుచేస్తూ విమర్శించిన వారు కూడా కోకొల్లలు. అయితే అసలు కోహ్లీకి, కుంబ్లేతో సమస్య ఏంటి? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికి తోచినట్లు వాళ్లు ఊహాగానాలు చేశారు. అప్పుడు టీమిండియా మేనేజర్గా ఉన్న రత్నాకర్ శెట్టి.. ఈ విషయంపై కొంత వివరణ ఇచ్చాడు.
‘ఆన్ బోర్డ్’ అంటూ ఆయన రాసిన పుస్తకంలో ఈ వివాదం గురించి ప్రస్తావించాడు. ‘కుంబ్లే కోచ్గా ఉండటం కొంతమందికి ఇష్టంలేదు. కెప్టెన్, కోచ్ ఇద్దరూ ఒకే వైపు లేరు. కెప్టెన్ పైచేయి సాధిస్తున్నట్లు కనిపించింది’ అని రత్నాకర్ తెలిపాడు. మరో షాకింగ్ విషయం కూడా వెల్లడించాడీ మాజీ మేనేజర్.
‘పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగడానికి ముందు ఒక మీటింగ్ జరిగినట్లు నాకు తెలిసింది. ఆటగాళ్లకు సరిగా మద్దతు ఇవ్వకపోవడంతోపాటు, డ్రెస్సింగ్ రూమ్లో టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నాడని కుంబ్లేపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది’ అని రాసుకొచ్చాడు.
కుంబ్లే రాజీనామాకు దారి తీసిన పరిణామాలు క్రికెట్ కేంద్రంలో కుళ్లు ఎంతలా వ్యాపించిందో అర్థమయ్యేలా చేశాయని రత్నాకర్ అభిప్రాయపడ్డాడు. అలాగే కుంబ్లే స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని బోర్డు సభ్యుడొకరు కోరారని, ఈ విషయాన్ని సెహ్వాగ్ తనకు ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెప్పాడని గుర్తుచేసుకున్నాడు.
ఆ తర్వాత జరిగిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) సమావేశంలో అందరి ముందే.. 2016లో చేసినట్లే తర్వరలోనే మరో కోచ్ను ఎంపిక చేయాల్సి ఉంటుందని వినోద్ రాయ్ చెప్పారట. ఆ సమావేశంలో కుంబ్లే కూడా అక్కడే ఉన్నారు. అతని ముందే ఈ మాట చెప్పడంతో తాను షాకైనట్లు రత్నాకర్ వెల్లడించాడు. ఆ తర్వాత కుంబ్లే రాజీనామా చేయడం, అతని స్థానంలో రవిశాస్త్రి కోచ్గా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే.