Spiritual Question | ఎందుకు? ఏమిటి? ఎలా? ప్రతి ప్రశ్నా విలువైందే! కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస చాలామందిలో ఉంటుంది. అందుకు సాధనం ప్రశ్నే! కానీ, ఎవరిని ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలి? ఈ విషయంలో ఎంత స్పష్టత ఉంటే.. వచ్చే సమాధానాలు అంత ఉన్నతంగా ఉంటాయి. సరైన వ్యక్తిని, సరైన పద్ధతిలో అడిగితే ప్రతి ప్రశ్నకూ వెలకట్టలేని సమాధానం దొరుకుతుంది. జీవితాన్ని తీర్చిదిద్దుకునే మార్గం ఏర్పడుతుంది. ఆ సమాధానాలు వారికే కాదు.. యావత్ జాతికీ దిశానిర్దేశం చేస్తాయి. అర్జునుడి ప్రశ్న కారణంగానే కురుక్షేత్రం వేదికగా గీత ఉద్భవించింది. నారద మహర్షిని వాల్మీకి అడిగిన ప్రశ్నరామాయణ కావ్యానికి ఆది శ్లోకమైంది. ఒక్క ప్రశ్నకు యుగయుగాలకు తరగని సమాధానాలు ఇస్తూనే ఉన్నాయి.
మనిషి బుర్ర ప్రశ్నల పుట్ట. ఉదయం లేచింది మొదలు ప్రతి నిమిషం ఏదో ఒక ప్రశ్న మనసును తొలుస్తూనే ఉంటుంది. అయితే, చాలావాటికి సమాధానం దాటవేస్తుంటాం. సరైన సమాధానం చెప్పుకోలేక.. సమాధానపడుతుంటాం. కానీ, ఆ ప్రశ్నలన్నిటినీ క్రమబద్ధీకరించి ఒక్కో దానికి సమాధానం అన్వేషిస్తూ పోతే ఏ ప్రశ్నా లేని స్థితికి చేరుకుంటాం. తత్తం బోధపడటం అదే! కానీ, ఏది నమ్మాలన్నా విచక్షణ అవసరం. జ్ఞానానికి మేలిపూత విచక్షణ. ఆ విచక్షణకు కవచం వివేకం. వివేకంతో అడిగే ప్రశ్నకు విలువైన సమాధానం ఎక్కడో ఒక దగ్గర తప్పకుండా దొరుకుతుంది.
‘మీరు దేవుణ్ని చూశారా?’ రామకృష్ణ పరమహంసను నరేంద్రుడు అడిగిన ప్రశ్న ఇది. రామకృష్ణులను తన గురువుగా అంగీకరించడానికి ముందు నరేంద్రనాథుడికి ఎన్నో అనుమానాలు. మరెన్నో సందేహాలు. ఇవి చాలవన్నట్టు పరమహంస ప్రవర్తన నరేంద్రుడికి విచిత్రంగా తోచేది. ఒక్కోసారి ‘ఈయన పిచ్చివాడా ఏమిటి?’ అన్న అనుమానమూ కలిగేది. పరమహంస ఇచ్చిన స్పష్టమైన సమాధానం నరేంద్రనాథుడిని స్వామి వివేకానందగా తీర్చిదిద్దింది. దేవుణ్ని చూశారా అన్న ప్రశ్నకు ‘నిన్ను ఎలా చూస్తున్నానో.. దైవాన్నీ అంతే స్పష్టంగా చూశాను’ అన్న మాటలు నరేంద్రుడి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేశాయి. తర్వాత ఆయన సందేహాలను ఒక్కొక్కటి నివృత్తి చేశాడు. ఒకే స్పర్శతో ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించి ప్రతి ప్రశ్నకూ సమాధానంగా నిలిచే ఆధ్యాత్మిక శిఖరంగా వివేకానందుడిని నిలిపాడు.
పురాణేతిహాసాలు, ఉపనిషత్తుల పుట్టుకకు ప్రశ్నే ప్రధాన కారణం. మైత్రేయుడు అడిగిన ఒక ప్రశ్న వల్ల విష్ణు పురాణం జగత్తుకు వరంగా లభించింది. ప్రశ్న ఉదయించినప్పుడే ఆలోచన పుడుతుంది. అందులోంచి సాధన మొదలవుతుంది. క్రమంగా అదే పరిశోధనగా కొనసాగుతుంది. ఓ ఎమిదేండ్ల పసిబాలుడు అడిగిన ప్రశ్న కఠోపనిషత్తుకు మూలమైంది. వాజశ్రవుడు ‘విశ్వజిత్’ అనే యాగం చేస్తాడు. యాగం పూర్తయిన తర్వాత రుత్విజులకు, పురజనులకు ధన, కనక, వస్తు, వాహనాలు దానంగా ఇస్తున్నాడు. వాజశ్రవుడి కొడుకు నచికేతుడు అక్కడే ఉన్నాడు. ‘నాన్నా నన్నెవరికి దానం ఇస్తావు?’ అని ప్రశ్నించాడు. సమాధానం ఇవ్వకుండా తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. పిల్లవాడు మళ్లీ మళ్లీ అడిగాడు. విసుగెత్తిన వాజశ్రవుడు ‘నిన్ను యముడికి దానమిచ్చాను పో’ అన్నాడు. తండ్రి మాటకు కట్టుబడి యముడి దగ్గరికి వెళ్లాడు నచికేతుడు. పసిబాలకుడి ముద్దుమాటలకు ముచ్చటపడ్డాడు యముడు. మూడు వరాలు కోరుకోమన్నాడు. ‘బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? దానిని నాకు అనుగ్రహించండి’ అని అడిగాడు నచికేతుడు. పరిపరివిధాల చెప్పినా పట్టు వదలడు. తన ప్రశ్నకు సమాధానం కావాల్సిందే అన్నాడు. చివరికి యముడు నచికేతుడికి బ్రహ్మజ్ఞానం బోధించాడు. అదే కఠోపనిషత్తుగా అవతరించింది. ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలియజేసింది.
సమాధానం లేని ప్రశ్నలంటూ ఉండవు. అయితే, ఆ ప్రశ్న భగవంతుడి గురించి అయితే అన్వేషణ మొదలవుతుంది. ఆ అన్వేషణ ఫలితంగా అలౌకికమైన ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుంది. మనసు సంపూర్తిగా తృప్తిపడే సమాధానం దొరకడమే ఆత్మానందస్థితి.
టి. వేంకట ఫణీంద్రకుమార్
Spiritual Question | ప్రశ్నించడం ఎలా?