న్యూఢిల్లీ: మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం.. తమ దగ్గర డబ్బు ఉంటే.. ఆభరణాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతారు.. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వారిలో భారీగానే మార్పులు తెచ్చింది. కరోనా అనంతర పరిస్థితుల్లో 70 శాతం మంది మహిళలు బంగారం కంటే ఇండ్లు,, ఇండ్ల స్థలాల కొనుగోళ్లకు, స్థిరాస్తుల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్స్ కంటే ఆస్తి కొనుగోలుకే అత్యధిక మహిళా మణులు మొగ్గు చూపుతున్నారని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ నిర్వహించిన సర్వేలో నిర్దారణ అయ్యింది.
దాదాపు 62 శాతం మంది మహిళలు తమ వద్ద ఉన్న డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. 82 శాతం మంది మహిళలు ఇల్లు కొనుగోలు కోసం.. 18 శాతం పెట్టుబడిగా ఇల్లు కొనుగోలుకు మొగ్గుతున్నారు.
54 శాతం మంది పురుషులు మాత్రం గోల్డ్, స్టాక్స్లో పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. కనీసం 68 శాతం మంది పురుషులు ఇండ్ల కొనుగోలు, 34 శాతం మంది పెట్టుబడి రూపేణా ఆసక్తి కనబరుస్తున్నారు.
70 శాతం మంది మహిళలు ఆస్తి కొనుగోలుకు ఇది సరైన సమయం అని భావిస్తుంటే.. 66 శాతం మంది రూ.90 లక్షల్లోపు చౌకధరకు వచ్చే ఇండ్ల కొనుగోలు కోసం ముందుకెళ్లాలని అంటున్నారు.
బిగ్ ఫార్మాట్ ఇండ్ల కోసం మహిళలు పట్టుబడుతుండగా, 46 శాతం మంది త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్లు, 30 శాతం మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 10 శాతం మంది ఫోర్ బెడ్రూమ్స్ ఇండ్లవైపు మొగ్గుతున్నారు. స్థిరాస్తులకు భద్రత పట్ల ప్రాధాన్యం ఇస్తున్న మహిళలు 31 శాతం మంది చౌక ఇండ్ల రుణాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. 28 శాతం మంది డెవలపర్ ఆఫర్లు, డిస్కౌంట్లవైపు మొగ్గుతుంటే, 22 శాతం మంది తమ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇండ్లు ఉండాలని ఆశిస్తున్నారు.
43 శాతం మంది మహిళలు, పురుషులు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులకు మొగ్గుతుంటే.. 21 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్లు, 20 శాతం మంది స్టాక్స్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.