Nature | ప్రకృతి అంటే పంచభూతాల కలయిక. భగవంతుడు ఈ ఐదింటికి ఐదుగురు దేవతలను నియమించాడు. సూర్యుడు ఎందుకు ప్రకాశించాలి? గాలి ఎందుకు వీయాలి? అగ్ని ఎవరి కోసం జ్వలించాలి? వర్షాలు సకాలంలో ఎందుకు కురవాలి? అందుకు కారణభూతమైన శక్తి ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలు మనలో ఉదయించడం లేదు. ప్రకృతి తన పని తాను చేసుకుని పోతుంది. చేసుకుపోవాలి అని భావిస్తాం కానీ, ప్రకృతిలోని హెచ్చుతగ్గులను, వృద్ధి క్షయాలను నియంత్రించే శక్తి ఒకటి ఉంటుందని భావించడం లేదు.
ప్రకృతి అంటే మనదృష్టిలో జడ పదార్థం. మనకు నిరంతరం సేవ చేస్తున్నా, అందుకు మనం మన కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ‘ప్రకృతి కన్నెర్ర చేసింది’ అంటుంటాం. మనలో కొందరు తాము నిర్వహించవలసిన కార్యాలను సక్రమంగా నిర్వహించకపోవడమే ప్రకృతి ప్రకోపానికి కారణం. మన జీవన విధానం ఎలా ఉంటే ప్రకృతి ప్రసన్నంగా ఉంటుంది? అని పరామర్శించుకోవడం లేదు. విచక్షణ మరిచి జీవితాన్ని గడుపుతున్న కొంతమంది, తమ జీవన విధానానికి మూలమైన ప్రకృతిని విస్మరిస్తున్నారు.
మన పూర్వికులు యజ్ఞయాగాదుల ద్వారా, ప్రార్థన, అర్చన, స్తుతుల ద్వారా దేవతలను ఉపాసించేవారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రకృతిని దైవ స్వరూపంగా భావించి, ఆరాధన భావంతో మనమూ జీవించాలి. ఇంద్రుడు, అగ్ని, భూమి, వరుణుడు, వాయువు, సూర్యుడు, చంద్రుడు మొదలైన దేవతలను ఆరాధించాలి. ప్రకృతి వనరులను కలుషితం చేయకుండా కాపాడుకోవాలి. ప్రకృతి వనరులను అవసరం మేరకు వినియోగించుకోవాలి. ఎవరినుంచి అయినా, ఏ శక్తినుంచి అయినా సాయం పొందితే అందుకు కృతజ్ఞతలు తెలియజేయడం మానవ ధర్మం. ప్రకృతి వనరుల వినియోగంపై బాధ్యతగా వ్యవహరించడమే పంచభూతాలను సృష్టించిన భగవంతుడికి మనం తెలియజేసే కృతజ్ఞత.
– వేదార్థం మధుసూదన శర్మ
Spiritual Question | ప్రశ్నించడం ఎలా?