కోల్కతా : పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వానికి, గవర్నర్ జగదీప్ ధన్కర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. మరో వైపు గవర్నర్ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. రాం ప్రసాద్ అనే న్యాయవాది జగదీప్ ధన్కర్ను ఆ పదవి నుంచి తొలగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ పరువు తీస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీకి మౌత్పీస్గా గవర్నర్ వ్యవహరిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.
అయితే, ఈ పిటిషన్ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. గవర్నర్ కోర్టుకు జవాబుదారీ కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం.. కార్యాలయ అధికారాలు, విధుల నిర్వహణ, పనితీరుపై గవర్నర్ కోర్టుకు జవాబుదారీ కాదని చీఫ్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. మరో వైపు గవర్నర్, సీఎంకు మధ్య రోజు రోజుకు వివాదం ముదురుతున్నది. సీఎం మమతకు గవర్నర్ లేఖ రాశారు. కార్యాలయానికి రావాలని, ఇప్పటికే పలు అంశాలపై అడిగిన సమాచారం ఇవ్వాలన్నారు. తాను సీఎంను కోరిన సమాచారంపై సమాధానం రాలేదంటూ లేఖను గవర్నర్ ఇవాళ ట్విట్టర్లో పోస్టు చేశారు.