West bengal | పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గవర్నర్ ధన్కర్ తీరును మరోసారి తప్పుబట్టింది. ఈ సారి ఏకంగా రాష్ట్రపతి, ప్రధానికి ఆయనపై ఫిర్యాదు చేసింది. దీంతో మళ్లీ ఆ ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. శాసన వ్యవహారాల్లో గవర్నర్ అతిగా జోక్యం చేసుకుంటున్నారని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాశారు. ”గవర్నర్ వ్యవహార శైలిపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశా. శాసన వ్యవహారాల్లో ఆయన జోక్యం మితిమీరింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఓ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఇలా వ్యవహరించడం ఏమాత్రం భావ్యం కాదు” అని స్పీకర్ అభ్యంతరం తెలిపారు.
అయితే స్పీకర్, గవర్నర్ మధ్య పొరపొచ్చాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఈ పొరపొచ్చాలు వచ్చాయి. ముఖ్యమంత్రి మమతాతో సహా ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయం విషయంలోనూ గవర్నర్ జోక్యం చేసుకోవడంతో అసెంబ్లీ స్పీకర్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పీఏసీ చైర్మన్గా ముకుల్ రాయ్ను నియమించే సమయంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.హౌరా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బాల్లీ మున్సిపాలిటీని వేరు చేయాలన్న విషయంలోనూ స్పీకర్, గవర్నర్ మధ్య విభేదాలు తలెత్తాయి.