కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అక్కడక్కడా చెదరుమదురు ఘటనల మినహా తొలివిడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 71.47 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా బంకురా జిల్లాలో 73.68 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు పోలింగ్ ముగియనుంది.
రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతుండగా 191 అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 21 మంది మహిళా అభ్యర్థులున్నారు.
సుమారు 43 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కమిషన్ 10,288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇవాళ తొలి విడత ఎన్నికలు ప్రారంభం కాగా.. ఏప్రిల్ 29న తుది విడత ముగుస్తాయి.
ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా బరిలో నిలువగా.. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కూటమిగా పోటీ చేస్తున్నది. ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తున్నది.