న్యూఢిల్లీ : తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడగా.. రేపటి వరకు తుఫానుగా మారుతుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) పేర్కొంది. ఈ ఏడాది తొలి తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడనుండగా.. ‘అసని’గా నామకరణం చేశారు. తుఫాను ఈ నెల 21 నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ నికోబార్ దీవుల వెంట ఉత్తర దిశగా కదులుతున్నదని.. అల్పపీడనం ఇవాళ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని, తర్వాత ఉత్తర – ఈశాన్య దిశగా కదులుతుందని భావిస్తున్నారు. 22న ఉదయం బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకారం.. అండమాన్ నికోబార్ దీవులు మినహా, ఇతర చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో వాయువ్య భారతంలో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కాకుండా, పశ్చిమ, మధ్య.. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను కారణంగా ఉష్ణోగ్రతలో తగ్గుదల ఉండొచ్చని.. మిగిలిన భాగాల్లో ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉంటదని ఐడీఎం పేర్కొంది.
ఇదిలా ఉండగా.. అల్పపీడనం కారణంగా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ జీవితం ప్రభావితమైందనిఅధికారులు పేర్కొన్నారు. పలు ద్వీపాల మధ్య షిప్పింగ్ సేవలను నిలిపివేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)కు చెందిన వంద మంది సిబ్బందిని మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా దీవుల్లోని పలు ప్రాంతాల్లో ఆరు సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.