కరీంనగర్ : చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కోర్టు చౌరస్తా వద్దగల శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత, జౌళీ శాఖ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను మంత్రి ప్రారంభించారు.
అనంతరం 40 స్టాళ్లలో ఏర్పాటుచేసిన రాష్ట్ర చేనేత సహకార సంఘాల ఉత్పత్తుల వస్త్రాలను, 20 స్టాళ్లలో ఏర్పాటుచేసిన ఇతర రాష్ట్రాల చేనేత వస్త్రాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేతకు చేయూత నిచ్చేందుకు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని అన్నారు. చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు అశోక్ రావు మాట్లాడుతూ ఈ నెల 1 నుంచి 14 వ తేదీ వరకు కొనసాగే రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను ఉమ్మడి జిల్లా ప్రజలు సందర్శించి తమకు నచ్చిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని, సెలవు రోజుల్లో కూడా ప్రదర్శన ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ కరీంనగర్ సహాయ సంచాలకులు సంపత్, ఆప్కో మాజీ డైరెక్టర్ సత్యనారాయణ, టెస్కో డీఎంఓ జనార్ధన్, చేనేత సంఘం అధ్యక్షుడు రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.