ఉస్మానియా యూనివర్సిటీ: దళిత ముద్దుబిడ్డ మోత్కుపల్లి నర్సింలుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరికైనా తగిన గుణపాఠం చెబుతామని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మోత్కుపల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూజేఏసీ, మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రేవంత్రెడ్డి ఫ్లెక్సీకి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రి, దళిత జాతి ముద్దుబిడ్డ మోత్కుపల్లి నర్సింలు నికార్సయిన మచ్చలేని నాయకుడని కొనియాడారు. రేవంత్కు దమ్ముంటే మోత్కుపల్లి సంధించిన ప్రశ్నలకు జవాబివ్వాలని, లేనిపక్షంలో టీపీసీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్కు దళిత, గిరిజన సభలు నిర్వహించే అర్హత లేదని మండిపడ్డారు.
దళితులపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్న రేవంత్కు రాబోయే ఎన్నికల్లో దళిత జాతి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గణేశ్, మహేశ్, బోరెల్లి సురేశ్, నరేశ్, రామకృష్ణ, రేవంత్, రాజు, మల్లేశ్, రాజేశ్, శరత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.