నిర్మల్, ఏప్రిల్ 6: జిల్లా కేంద్రంలో భారత రత్న డా. బీఆర్. అంబేద్కర్ భవన్ ఏర్పాటుతో మూడున్నర దశాబ్దాల కల నెరవేరిందని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేదర్కర్ భవన్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి గతంలో ఈ భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు మంజూరు చేశారని, సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ దశల వారీగా నిధులు మంజూరు చేశారన్నారు.
ఈ నెల 12న ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి అంబేద్కర్ భవన్ ను ప్రారంభించుకుంటున్నామని వెల్లడించారు. 2 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా విశాలమైన ఆడిటోరియం, సమావేశ మందిరం, ఇతర ఆధునాతన వసతులతో దీన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, కలెక్టర్ ముశారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు ఉన్నారు.