అమరావతి : పేదల ఆకలిని తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని నిర్వహించి తీరుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఇవాళ తెనాలి పట్టణంలోని మార్కెట్ సర్కిల్లో అన్న క్యాంటీన్లను అడ్డుకున్న పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్ను అడ్డుకోరని అన్నారు.
నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారని, ఇప్పుడు తెనాలిలోనూ అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతుండటంపై అసహనం వ్యక్తంచేశారు. రోజు మాదిరిగానే ఆహారం తీసుకువస్తున్న టీడీపీ వారి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వేరే చోటికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వాహనంలో నుంచి కొంత ఆహారాన్ని తీసుకుని మున్సిపల్ మార్కెట్ వద్దకు చేరుకు ఆహార పంపిణీని చేపట్టారు. అక్కడకూ చేరుకున్న మున్సిపల్ అధికారులు ఆహార పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేయగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
అదేసమయంలో వైసీపీ శ్రేణులు మున్సిపల్ మార్కెట్ వద్ద అన్నదానానికి యత్నించారు. ఐతే తమకు ఆంక్షలు విధించి వైసీపీ శ్రేణులను ఎలా అనుమతిస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. మార్కెట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.