అమరావతి : తప్పుడు కేసులతో బెదిరించి ఇష్టానుసారంగా వ్యవహరించే ఏపీ పోలీసు అధికారుల ఆటలు సాగనీయబోమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వారిపై చట్టపరంగా కేసులు పెట్టి దోషులను చేస్తామని హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సిన్సియర్గా పనిచేసే అధికారులను అభినందిస్తామని అన్నారు.
రాజకీయ పార్టీగా తమకు పోలీసులతో శత్రుత్వం లేదని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించే అధికార పార్టీపై రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘించి ఏకపక్షంగా వచ్చి కావాలని తప్పుడు కేసులు పెట్టి హింసకు గురిచేస్తే సహించబోమని అన్నారు. రాష్ట్ర పోలీసులు సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఆరోపించారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 600 మందిపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదని చంద్రబాబు అన్నారు.