హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి స్వరాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్కు మీడియా, మనీ, మజిల్ పవర్ లేదని.. కొందరు నిరాశ కల్పించినా కుంగిపోకుండా తెలంగాణ సాధనలో విజయం సాధించారని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు.
ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ది సీఎంలను ఉరికించిన చరిత్ర అని తమ మౌనాన్ని బలహీనంగా భావించొద్దన్నారు. గోడకు వేలాడదీసే తుపాకీ సైతం మౌనంగానే ఉంటుంది.. సమయం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుందని ప్రతిపక్షాలకు చురకలంటించారు. కేసీఆర్ మౌనాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ఆయన మాట్లాడితేఎలా ఉంటుందో యావత్ తెలంగాణకు తెలుసన్నారు. ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ ఆవిర్భవించి 2 దశాబ్దాలని ఆయన గుర్తుచేశారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రజల గుండెల్లో నిలిచిందని పేర్కొన్నారు.
‘వాట్సప్ వర్సిటీలో బీజేపీ నాయకులు అబద్దాలు నేర్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారు. విద్యారంగానికి కేంద్రంలోని బీజేపీ చేసింది గుండు సున్నా. రాష్ట్రానికి రావాల్సిన సంస్థలను కూడా ఇవ్వట్లేదు. తెలంగాణకు నవోదయ విద్యాలయాలు కూడా దక్కలేదు. కొత్త వైద్య కళాశాలల్లోనూ తెలంగాణకు మొండిచెయ్యి చూపారు. తెలంగాణ పట్ల వివక్ష చూపిన బీజేపీకి ఓటేందుకు వేయాలి. విశాఖలో ఉక్కు పరిశ్రమను మూసేస్తున్న వారు బయ్యారంలో పరిశ్రమ కడతర? ఒకడు ఎగిరెగిరి ఏమైపోయాడో తెలుసు. అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు తడాఖా చూపుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు ద్వారా బీజేపీకి సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.