హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రాజెక్టుకు నిర్దేశించిన గడువు ప్రకారం రుణాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ఆర్ఈసీ సీఎండీ రవీందర్కుమార్ దేవాంగన్, పీఎఫ్సీ సీఎండీ రవీందర్ సింగ్ దిల్లాన్ హామీ ఇచ్చారు. వీరు మూడురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్తో పాటు కాళేశ్వరం, ఇతర విద్యుత్తు ప్రాజెక్టులను ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావుతో కలిసి పరిశీలించారు. పనుల నిర్వహణ గురించి ప్రభాకర్రావు వారికి వివరించారు. యాదాద్రి పనులు చేపడుతున్న బీహెచ్ఈఎల్ యాజమాన్యంతో ఆర్ఈసీ, పీఎఫ్సీ సీఎండీలు మాట్లాడారు. అనంతరం యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టులపై సమీక్షించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశం ముగిశాక ఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ సీఎండీలు ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు.