ఖమ్మం, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గవర్నర్ తమిళిసై తన పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే గవర్నర్ వ్యవస్థపై పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. విమోచన, విలీన దినోత్సవాలకు సంబంధించిన రాజకీయ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని గవర్నర్ను ప్రశ్నించారు.
గవర్నర్ రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలే తప్ప రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని సూచించారు. గవర్నర్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్కు సాయుధ పోరాటానికి సంబంధించిన పుస్తకాలు పంపిస్తామని, ఆ తర్వాత ఆమెను చర్చకు ఆహ్వానిస్తామని తెలిపారు. చర్చకు అవకాశం ఇవ్వని పక్షంలో రాజ్భవన్ ముట్టడిస్తామని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధికోసమే సెప్టెంబర్ 17న కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆరోపించారు.
బీజేపీ.. కరోనా కన్నా ప్రమాదకరమని, ప్రజల మధ్య మతచిచ్చు రగిలిస్తున్నదని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధిపొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పని చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను బీజేపీ తమ వాడంటున్నదని ఎద్దేవా చేశారు. వల్లభాయ్ పటేల్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఎలా అవుతాడో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మతోన్మాద బీజేపీని అడ్డుకొనేందుకే తమ పార్టీ మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్.. సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం హర్షణీయమన్నారు. ఆ నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తుందని కూనంనేని తెలిపారు.