శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలోని ప్రధాన వీధుల్లో ఉన్న దుకాణాల తరలింపు విషయంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేస్తామని దేవస్థానం ఈవో లవన్న పేర్కొన్నారు. ఆలయ పరిపాలన భవనంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయ పరిసరాల అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ప్రధాన వీధుల్లోని దుకాణాలన్నింటినీ ఒకే గొడుగు కిందుకు తీసుకువస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన లలితాంబిక వాణిజ్య సముదాయంలో దుకాణాల కేటాయించేందుకు గతంలో జరిపిన వేలంపాటను పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.
దుకాణాల కేటాయింపుపై కోర్టును ఆశ్రయించిన వారిని మినహాయించి మిగతా దుకాణాల వారికి చదరపు అడుగుల నిర్ణీత ధరల్లో కేటాయించేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దుకాణాల కేటాయింపులో బినామీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా క్షేత్రంపై ఆధారపడి జీవనం కొనసాగించే చెంచులకు 30 దుకాణాలు కేటాయించి, వారికే చెందేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పదుల సంవత్సరాలుగా స్థిరపడిన హిందుయేతరులకు కూడా కోర్టు ఉత్తర్వుల ప్రకారం కార్యాచరణ నిర్ణయించినట్లు తెలిపారు. దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిద్ధరామప్ప, లలితాంబిక వాణిజ్య సముదాయాలకు సుమారు రూ.29కోట్లు వెచ్చించినప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడంతో రూ.55కోట్ల లీజు, అద్దె రాబడిని కోల్పోయినట్లు వివరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే దుకాణాల కేటాయింపులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావివ్వమని స్పష్టం చేశారు.