శ్రీనగర్ : ఈ నెల 24న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతామని గుప్కర్ కూటమి నేతలు తెలిపారు. భేటీకి ముందు కూటమి నేతలు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అఖిలపక్షం సమావేశానికి సంబంధించి వ్యూహం సిద్ధం చేశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి తనతో పాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, మహ్మద్ తారిగామి హాజరవుతారని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. సమావేశం ఎజెండా ఇవ్వలేదని, ఈ సందర్భంగా ప్రధాని, హోంమంత్రి ముందు మా అభిప్రాయాలు వెల్లడిస్తామన్నారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ‘మా నుంచి తొలగించిన’ (ఆర్టికల్ 370) దానిపై మాట్లాడుతామన్నారు.
అలాగే రాజకీయ ఖైదీలను సైతం విడుదల చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. ప్రధానితో సమావేశానికి ఆహ్వానించిన 14 మంది నాయకుల్లో ఒమర్ అబ్దుల్లా సైతం ఉన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ రాజకీయ కార్యకలాపాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. మొత్తం పరిస్థితిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపాదిత సమావేశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. పీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మెహబూబా ముఫ్తీకి అధికారం ఇవ్వగా. ఎన్సీ చీఫ్ పార్టీ ఎంపీలు, నాయకులు రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్ని పార్టీ సైతం సమావేశమై అభిప్రాయానికి వచ్చాయి. అఖిలపక్షాల సమావేశానికి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, నలుగురు ఉప ముఖ్యమంత్రులు సహా 14 మంది నాయకులను పిలిచిన విషయం తెలిసిందే.