టీమిండియా త్వరలో యూఏఈ వేదికగా జరుగబోతున్న ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్తో పాటు ఫినిషర్ దినేశ్ కార్తీక్కూ చోటు దక్కింది. ఈ ఇద్దరిలో ఎవర్ని ఆడిస్తారు..? అనే విషయంపై స్పష్టత లేదు. ఆసియా కప్తో పాటు అక్టోబర్ నుంచి జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్లో కూడా ఈ ఇద్దరిలోనూ ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపైనా ఇండియన్ క్రికెట్లో జోరుగా చర్చ నడుస్తున్నది.
ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కార్తీక్తో పోటీతో పాటు తుది జట్టులో ఎవరుంటారు..? అనే విషయమై పంత్ స్పందించాడు. తనకు కార్తీక్తో పోటీ లేదని మ్యాచ్లో వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తామిద్దరం ఒకే విధంగా కష్టపడతామని పంత్ తెలిపాడు.
ఓ న్యూస్ ఛానెల్తో పంత్ మాట్లాడుతూ.. ‘మేము ఇద్దరి మధ్య పోటీ గురించి ఆలోచించడం లేదు. వ్యక్తిగతంగా జట్టుకు వంద శాతం బెస్ట్ ఇవ్వాలని బరిలోకి దిగుతాం. అక్కడివరకే మా చేతుల్లో ఉంది. ఇక మా ఇద్దరిలో ఎవరు ఆడతారనేది మా చేతుల్లో లేదు. అది హెడ్ కోచ్, కెప్టెన్లు నిర్ణయిస్తారు. జట్టుకు ఏది అవసరమో అదే వాళ్లు చేస్తారు..’ అని అన్నాడు.
ఈ ఇద్దరూ కలిసి జూన్లో స్వదేశంలో ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్తో పాటు ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ సిరీస్లో సైతం కలిసి ఆడారు. రాబోయే ఆసియా కప్లో కూడా ఈ ఇద్దరూ కలిసే ఆడనున్నారు. మరి నిలకడగా రాణిస్తున్న ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలంటే అది సెలక్టర్లకు కష్టమే..!