వాస్తవానికి ఐపీఎల్కు ఇప్పుడు ఆఫ్ సీజన్. ఐపీఎల్-15 ముగిశాక ‘మీడియా రైట్స్’ అంశం తప్ప అందుకు సంబంధించిన వార్తలేవీ మీడియాలో అంతగా ప్రాధాన్యం సంపాదించలేదు. కానీ రెండ్రోజుల నుంచి ఐపీఎల్ మళ్లీ పతాక శీర్షికలకెక్కింది. కారణం న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ఈ కివీస్ దిగ్గజం.. తాజాగా తన జీవిత చరిత్రకు సంబంధించిన ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పుస్తకంలో అతడు.. ఐపీఎల్-2011 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యజమానికి ఒకరు తనపై చేయి చేసుకున్నాడని వెల్లడించడం పెనుదుమారం రేపుతున్నది.
అయితే ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఫ్రాంచైజీ మీద ఏదైనా చర్యలు తీసుకుంటుందా..? అని మీడియా ప్రశ్నించగా దానికి ఆ సంస్థ ‘ఈ విషయం గురించి మాకు తెలియదు..’ అని స్పందించింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘నేను ప్రస్తుతం ట్రావెలింగ్లో ఉన్నాను. అసలు ఏ అంశం గురించి చర్చ జరుగుతుంది..? ఏంటనేదానిమీద నాకు అవగాహన లేదు..’ అని తెలిపాడు.
ఇక ఇదే విషయమై రాజస్తాన్ రాయల్స్ను వివరణ కోరగా ఆ ఫ్రాంచైజీ ప్రతినిధులు ‘నో కామెంట్స్’ అని అన్నారు. అయితే టేలర్ ‘చెంపదెబ్బ’ఉదంతంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తున్నది. 2011లో టేలర్పై చేయి చేసుకున్న సదరు యజమాని శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ దీనిపై అటు రాజస్తాన్ యాజమాన్యం గానీ, ఇటు శిల్పాశెట్టి కుటుంబం గానీ స్పందించలేదు.