అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. అధికారులు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయానికి 2,80,348 క్యూసెక్కుల నీరు వస్తుండగా 2,27,325 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకుగాను ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆరు క్రెస్ట్ గేట్ల ద్వారా 60,453 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 42,213 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 69.1 టీఎంసీలుగా ఉంది. కర్నూల్ జిల్లా సుంకేశుల ప్రాజెక్ట్ 13 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేశుల ఇన్ఫ్లో 54,087 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 52,832 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.