ఈ శతాబ్ది ప్రారంభంలో థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో ‘వాట్ త్రాయ్ మిత్’ అనే బౌద్ధ విహారంలో బుద్ధుని ప్రతిమకు ఆరాధన జరుగుతున్నది. సుమారు 13వ శతాబ్దానికి చెందిన 16 అడుగుల మృణ్మయ (మట్టి) విగ్రహమది. భక్తిప్రపత్తులతో బౌద్ధ భిక్షువులు విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు.
రెండో రోజు బుద్ధుడి విగ్రహాన్ని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇంతలో ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా భిక్షువుల ముఖాల్లో ఆవేదన, ఆందోళన! వర్షంతో ఆ మట్టివిగ్రహం ఎక్కడ కరిగిపోతుందో, తమ ఆరాధ్యమూర్తి ఎక్కడ అదృశ్యమైపోతాడోనని బాధపడసాగారు. పరదాలతో కప్పి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జోరు వాన మొదలైంది. ప్రజలందరూ నలుదిక్కులకూ చెదిరిపోయారు. ప్రతిమ వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. భిక్షువులు ఏం చేయాలో తోచక నిశ్చేష్టులైపోయారు.
వర్షం నీటికి విగ్రహం క్రమంగా కరగడం మొదలైంది. భిక్షవుల కండ్లు చెమ్మగిల్లాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. బుద్ధ భగవానుని విగ్రహం బంగారంలా ప్రకాశించసాగింది. మట్టి విగ్రహం మాటున ఉన్న బంగారు భగవానుడు బయటపడ్డాడు. అది మృణ్మయమూర్తి కాదు, స్వర్ణమూర్తి అని అందరికీ స్పష్టమైంది. తర్వాత భిక్షువులు తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. పదమూడో శతాబ్దంలో విదేశీ దాడుల నుంచి కాపాడుకునేందుకు తమ పూర్వికులు బంగారు విగ్రహానికి మట్టిపూతను పూశారని తెలుసుకున్నారు. ‘ఇన్నాళ్లూ మట్టి విగ్రహాన్ని ఆరాధించాం! అలాగే నశించిపోయే మన దేహంపై ధ్యానంతో బతికేస్తున్నాం. స్వర్ణ సిద్ధార్థుడి రూపంలో ఉన్న ఆత్మను విస్మరిస్తున్నాం. ఇకనైనా మనలో అంతర్యామిగా ఉన్న బుద్ధుణ్ని వెలికితీద్దాం. ఆయన బోధనల్ని ఆచరణలో పెడదాం’ అని భిక్షువులకు గురువు ఉద్బోధించాడు. నిజంగా మనం కూడా అలా మనలోని బంగారు బుద్ధుడిని ఆవిష్కరించుకుందాం! థాయ్లాండ్లోని స్వర్ణ సిద్ధార్థుడి మూర్తి నేటికీ పూజలు అందుకుంటున్నది. – మనోజ్ఞ