పల్లెప్రగతితో గ్రామంలో కొత్త వెలుగులు
తీరిన చెత్తాచెదారం, మురుగు సమస్య
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనం
చివరి మజిలీకి చింతలేకుండా శ్మశానవాటిక
అద్దంలా మెరుస్తున్న వీధులు
ఎల్కతుర్తి, మార్చి 22 : పెంచికల్పేట గ్రామంలో మొత్తం 2,123 జనాభా ఉంది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం నెలనెలా రూ.5,59,819 నిధులిస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తుల సహకారంతో ఈ నిధులను ప్రణాళికా ప్రకారం ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి బాటలు వేసుకున్నారు. వీటిలో నుంచి ఇటీవల గ్రామ పంచాయతీకి తీసుకున్న ట్రాక్టర్ లోన్ కట్టడంతో పాటు నలుగురు గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు, పల్లెప్రకృతి వనం ఏర్పాటు, నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, శానిటేషన్, వీధి దీపాలు, ట్రీ గార్డ్స్, ఇంటింటికీ తడి పొడి చెత్త సేకరణ బుట్టల పంపిణీ, మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం లేని వాడలకు పైపులు వేయడం తదితర పనులు చేయించారు. గ్రామంలో ఐదు ముఖ్య కూడళ్లలో ఎల్ఈడీ బల్బులు అమర్చారు. రూ.12.50లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50లక్షలుతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. పల్లె ప్రకృతి వనం పనులు పూర్తయ్యాయి. అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతివనంలో దాదా పు 3,389 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామస్తుల నుంచి తడి, పొడి బుట్టల్లో సేకరించిన చెత్తను జీపీ ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్ షెడ్డుకు తరలించి ఎరువును తయారు చేసి ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను వేస్తున్నారు. గ్రామంలోని 145 విద్యుత్ స్తంభాలకు థర్డ్ వైరును అమర్చారు. పల్లెప్రకృతి వనం, నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్లో పని చేస్తున్న ఐదుగురు కూలీలకు రోజుకు రూ. 230 చెల్లిస్తూ వాటిని సంరక్షిస్తున్నారు. ఏడు పాత ఇండ్లను కూల్చివేయడంతోపాటు రెండు పాత బావులను పూడ్చారు.